Pages

Tuesday 30 April 2013

****మేడే నాటి ముభారకులు ****

****మేడే  నాటి ముభారకులు ****

నాగలి పట్టే నాగన్న రెక్కలు తెగిన రైతన్న
సమ్మెట పట్టే సూరన్న సన్నాయి మేళం సంగన్న
మీసం మెలిలో
  మగ్గిపోతున్న మంగలి సత్తెన్న 
మురికి బట్టలు చుట్టి మూటను కట్టే చాకలి చిమ్మన్న

రెక్కలు
 ముక్కలు చేసి రంగుల చీరలు నేసే దేవాంగి దానయ్య
కండలు కరిగించే కంసాలి కామయ్య
కంపును ఇంపుగా మోసే పాకీ పాపమ్మ
కావడి కుండలు మోసే కుమ్మరి కూనయ్య

బుగ్గిలో మగ్గి బుట్టలు తట్టలు అల్లే మేదరి ముసలయ్య
బుగ్గలు బుగ్గి అయ్యేదాకా శంకం ఊదే జంగాల సాంబయ్య
ఆకాశం నుండి అమృతం దించి ఆగమైపొతున్న గౌన్ల గురయ్య
అప్పడాలు అద్ది అంగట్లో అమ్మే కోమటోల కనకమ్మ

డప్పులుకొట్టి
 దండోరా  వేసే మాలోల ముత్తయ్య
చెమటలు పట్టి
 చెప్పులు కుట్టే మాదిగ మల్లయ్య
చెత్తను చెరిపేసి చిత్రం గీసేసిన
 శుబ్బరాలు చుక్కమ్మ  
నెత్తుటి చుక్కలు చిమ్మి
 బండలు పిండి చేసే పటానయ్య 

మండే ఎండలతో ఎండే గుండెలతో
 
కాయా కష్టంతో వచ్చిన నష్టంతో కనుమరుగౌతున్న
 
కార్మిక
  కర్తలకు కాలే కడుపులకు కర్షక జీవులకు
మేడే
  నాటి ముభారకులు


                                                                మీగడ త్రినాధ రావు 







Monday 29 April 2013

ఒక్కసారి చెప్పండి మీ జేజేలు...http://telugu.greatandhra.com/politics/april2013/26c_one_time.php

ఒక్కసారి చెప్పండి  మీ జేజేలు

ప్రజా సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వాలు ధనార్జనే ధ్యేయంగా ప్రజా శ్రేయస్సును గాలికి వదిలేస్తున్నాయి. ఈ రోజు మంచినీళ్ళు దొరకని ఊళ్ళు చాలా వున్నాయి కాని మద్యం దొరకని వూరంటూ వుండదు. పల్లె పల్లెకు  అర్దరాత్రి అపరాత్రి అనకుండా మద్యం విక్రయిస్తున్నాయి. మరోప్రక్క అడుగడుక్కి నోట్లో గొట్టాలు పెట్టి పోలిసుల  చేత తనికీలు నిర్వహిస్తుంది . వాళ్ళ దృష్టిలో ఇంటికెళ్ళి త్రాగండి బాబులు అని అర్ధం కావచ్చు అలా అయితే బార్లుకు బార్లా తెరిచి ఇబ్బడి ముమ్మడిగా లైసెన్సులు ఎందుకు ఇస్తున్నట్లు ?  మరి "బార్లా తెరచిన బార్లలో" తాగిన వాడు రోడ్డు ఎక్కక ఉదయం వరకు అక్కడే పవలిస్తాడా ? ఇంటికెళ్ళి నీట్ గా తయారయ్యి ఫ్రీజర్ లో పెట్టుకొని సోడా పోసుకొని త్రాగటానికి వాళ్ళుకి కుదురుతుందా ? అంత నిలకడ తనం రెక్కలు ముక్కలు చేసుకున్న ఆ  బడుగు జీవులుకు ఎక్కడ వుంటుంది ?

ఈ మద్య జరుగుతున్న చాలా అత్యాచారాలకి రాత్రి పూట పూటుగా మద్యం సేవించి కన్ను మిన్ను కానకుండా యువతుల్ని ఏడిపించి వారితో తోడుగా
 వున్న భర్తల్ని ,అమ్మల్ని , అన్నల్ని,  స్నేహితులని చావ బాది వాళ్ళ ముందే కిరాతకంగా అత్యాచారం చేస్తున్నారు. లేదంటే ఏ లారీ కిందకో బస్సు క్రిందకో తోసేస్తున్నారు . మద్యం మైకంతో  ఇంటికొచ్చిన కొంతమంది తాగుబోతులు  వావి వరుసలు చూడకుండా  కూతురనక,  చెల్లి అనక, పసిపిల్లలనక  అత్యాచారం చేస్తున్నారు. రోజుకు నాలుగు వందలు సంపాదిస్తే మూడువందల మద్యం త్రాగి వందో యాబయ్యో భార్యకు ముస్టివేసి పిల్లలని మల మాలా మాడుస్తున్నారు  మరికొంతమంది బడుగుజీవులు .

ఒక ప్రక్క "మద్యం త్రాగితే ఆరోగ్యానికి హానికరం" అంటూనే బాగా మద్య త్రాగండి , అర్దరాత్రి అపరాత్రి అనకుండా తిరగండి , ఇల్లు ఒళ్ళు గుళ్ళ
  చేసుకోండి అని ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తుంది. ఎన్టీఆర్ పుణ్యామా అని మద్య నిషేధం వచ్చినా కూడా ఎన్నో రోజులు అమలుకు నోచుకోలేదు.  ఆ తరువాత వచ్చిన చంద్రన్న నెమ్మదిగా మద్య నిషేదాన్ని అటకెక్కించి ఇప్పుడు నీతి సూత్రాలు వల్లి వేస్తున్నారు , ఆ తరువాత రాజన్న వచ్చి ఎక్కడో పట్టణంలోనే దొరికే మద్యం సీసాని పల్లె పల్లె కి అందించి అభివృద్ధి బాట పట్టించారు. ఆ తరువాత వచ్చిన  రోసన్న , కిరణనన్నలు కూడా  ఆ అభివృద్దిని అలాగే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని "మద్యాంద్ర ప్రదేశ్" గా మార్చి ప్రజల ఋణం తీర్చుకుంటున్నారు .

కనుక బలిఅవుతున్న బడుగులారా
చితికి పోతున్న చెల్లులారా
అందరూ ఒకసారి చెప్పండి ఈ అన్నలందరికీ మీ జేజేలు.


మీగడ త్రినాధ రావు

సంపూర్ణ ఆరోగ్యం..."విశాఖ సంస్కృతి " మాస పత్రిక ఏప్రిల్ 2013

 

  సంపూర్ణ ఆరోగ్యం

ఆరోగ్యం అంటే ఒక్క శారీరక ఆరోగ్యమే అనే భావం మనలో చాలా మందిలో పాతుకుపోయి వుంటుంది.  శారీరకంగాను, మానసికంగాను దృడంగా  వున్నప్పుడే మాత్రమే అది నిజమయిన  " సంపూర్ణ ఆరోగ్యం"  అవుతుంది . జలుబు , దగ్గు , జ్వరం , తలనొప్పి మొదలగు చిన్న చిన్న జబ్బులనుండి దీర్గకాలిక రోగాలు అయిన రక్త పోటు , మదుమేహం , హృద్రోగం వంటి ఇతరత్రా జబ్బులకి మనం ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా మందులు వేసుకుంటాము . కానీ మనకి ఎన్నో రోగాలకి మూలం మానసిక సమస్యలే కారణం అని  మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు . కేవలం రోగాలకు మాత్రమే మందులు వాడి వాటి కారణమైన మూలాలను మాత్రం పట్టించుకోవటం లేదు. 

కలుపు మొక్క ఒక్కటే పీకేస్తే ఏమౌతుంది మళ్ళీ వేర్లు మొలుస్తాయి . ఆ వేర్లోతోసహా పీకేస్తే సమస్యే వుండదు . మనం అసలు సమస్యను వదిలేసి వ్యాదికి మందు వాడుతుంటాము . అది తాత్కాలిక ఉపసమనం మాత్రమే ఇస్తుంది. వ్యాది మూలాల్ని కనిపెట్టి వాటికి నష్ట నివారణ చర్యలు చేపడితే మనకి సంపూర్ణ ఆరోగ్యం సాద్యమౌతుంది . ఈ యాంత్రిక యుగంలో మనిషి అనేక ఆటుపోట్లకు, ఒత్తిడులకు  గురిఅవుతున్నాడు  ఇంగ్లీష్ వైద్యం పుణ్యామా అని మనకి ఎంత తొందరగా వ్యాదులు తగ్గుతున్నాయో అంతే  తొందరగా మరలా వస్తున్నాయి కానీ వ్యాది మూలాలు పోవటం లేదు .  కొన్ని సస్త్ర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యం తప్పనిసరి అయితే కావచ్చు .  ఇక్కడ యే వైద్యాన్ని చులకన చెయ్యటం కాదు. ఇంగ్లిష్ వైద్యుడు ఉప్పు తగ్గించాలి అంటాడు యెందుకంటే పూర్తిగా మానెయ్యమంటే రోగి ఆ మరునాటి నుండి రావటం మానేస్తారు అని.  ప్రకృతి వైద్యులు మాత్రం శాంతం ఉప్పు మానేయండి అంటారు. కానీ ఇప్పుడు వున్న పరిస్థితుల్లో మనం సాంప్రదాయ ఆయుర్వేదం , ప్రకృతి వైద్యం , హోమియో , యునానీ వంటి సాంప్రదాయ వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వటం మంచిది వీటితో పాటు ముందు మానసిక సమస్యలను తగ్గించు కోవటానికి మొగ్గు చూపాలి .

అభివృద్ది చెందిన దేశాల్లో అయితే ఏ చిన్న మానసిక సమస్యలను వారు నిర్లక్ష్యం చెయ్యరు , వెంటనే మానసిక నిపుణుల సలహాలు పాటిస్తారు . మన దేశంలో ఇంకా ఇది ప్రాచుర్యం పొందలేదనే చెప్పాలి . దీనికి చిన్న విశ్లేషణ వుంది వారి జీవన శైలి వేరు మన జీవన శైలి వేరు అక్కడ కుటుంబ వ్యవస్థ మనంత పటిష్టం కాదు , భార్యా భర్తల సంబందాలులో నిలకడ లేనితనం అనేది  వారి సంతానం మీద, వారి సామజిక వ్యవస్థల మీద ఆరోగ్యం మీద  ప్రభావం చూపించవచ్చు. కానీ మన దేశంలో కూడా ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు పాచ్యాత్య పోకడలు ఆధునిక నాగరికత పేరుతో ఒక అంటువ్యాదిలా దినదినం అభివృద్ది చెందుతుంది . తద్వారా  మన దేశంలో  క్రమంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. 

మనిషికి మనిషికి దూరం పెరుగుతుంది. బాద చెప్పుకోవాలంటే వినటానికి మనుషులు కరువవుతున్నారు  ఎవరి నడకవారిది , ఎవరి పరుగు వారిది . అంతే కాకుండా మారుతున్న మన జీవన వ్యవస్థ ఆహారపు అలవాట్లు కూడా అనేక రోగాలుకు కారణం అవుతున్నాయి , మరి మన పూర్వీకులుకు లేవా అంటే ఉండేవి కానీ మరి వారి శారీరక శ్రమ అలాంటిది వారి శారీరక శ్రమ వారి జీవన వ్యవస్థ మూలంగా సమస్యలు చాలా వరకు కుటుంబాలు లోనే పరిస్కారం అయ్యేవి .  ఈనాడు నగర సంస్కృతి ఎక్కువైంది  ఇద్దరు పక్కింటివాళ్ళు రోడ్డు మీద కలిస్తే ఎవరో తెలియని పరిస్థితి . అన్ని కృత్రిమ బందాలు , కృత్రిమ స్నేహాలు, కృత్రిమ ఆటలు, కృత్రిమ ఎరువులు, కృత్రిమ మనుషులు, మనసులు ఇలా ఒకటా రెండా "కర్ణుడు చావుకి అన్ని కారణాలే అన్నట్టు" మానసిక సమస్యలకు బోలెడన్ని కారణాలు ముఖ్యంగా మితిమీరిన పోటి తత్వం , ఉరుకులు పరుగుల జీవితం మనిషిని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి . చివరికి పిల్లల స్కూల్స్ చదువులు విషయంలో కూడా మితిమీరిన పోటీ తత్వంతో పెద్దలు పరుగులు పెట్టి పసిపిల్లలని పరుగులు పెట్టించి వారిని తీవ్ర మైన వత్తిడికి గురి చేస్తున్నారు వాళ్ళకి  ఆశక్తి వుందా లేదా చదవగలడా లేదా అని చూడకుండా బలవంతంగా పెద్దలు వారి అభిరుచులును వారిపై రుద్దుతున్నారు ..

ప్రతిరోజు  మనం ఎన్ని వార్తలు చదవటం లేదు?  చిన్న చిన్న కారణలకే ఉసురు తీసుకుంటూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు , మరి పూర్వం లేవా సమస్యలు అంటే బోలెడు ఎన్ని సమస్యలున్నా వారి జీవన శైలి మూలంగా దూది పింజేల్లాంటి మేఘల్లా సమస్యలు అలా అలా మాయమయ్యేవి చెప్పేవాళ్ళు వుండేవారు, అమ్మమ్మ , నాన్నమ్మ తాతయ్యల హితబోదలు, నీతికధలు ఉండేవి . బలమైన బందాలు ముందు సమస్యలన్నీ పటాపంచాలయిపోయేవి . ఈ రోజు చాలా మంది అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు ఓల్డ్ ఏజ్ హోం లకే పరిమితం అవుతున్నారు . అత్తవారింటికి వెళ్ళిన కొత్తకోడళ్ళు వేరే గ్రహం మీద కాలుమోపినట్టు బావిస్తున్నారు , ప్రతి చిన్న సమస్యలకు వీదిన పడుతూ విడాకులు తీసుకుంటున్నారు , భార్యా భర్తల్లో పెరుగుతన్న ఆర్దిక సమస్యలు - ఆర్దిక స్వాతంత్ర్యం రెండూ కారణాలే "నువ్వెంత అంటే నువ్వెంత "అనే స్థాయికి వెళుతున్నారు . ఆ మద్య వచ్చిన జగపతిబాబు ప్రియమణి ల "పెళ్ళైన కొత్తలో" అనే సినిమా నేను చెప్పిన ఉదాహరణకి చక్కగా అద్దం పడుతుంది. చూడనివారు డీవీడీ తెచ్చుకొని కొత్తగా పెళ్ళైన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా అది .

కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అనేది వారి సంతానానికి తద్వారా చివరికి సమాజ మనుగడనే శాసిస్తుంది. ఇది వాస్తవం. ఇంట్లో భార్యతో గొడవపడి ఒక మనిషి ఆఫీసులో సక్రమంగా మనసుపెట్టి పనిచెయ్యగలడా ? అలాగే ఇంటి ఇల్లాలు కూడా . వారి పిల్లల పెంపకం కూడా అలానే వుంటుంది ఇక్కడ ఇంకో విషయం వర్షం లో తడిసే ప్రతి మనిషికి జ్వరం, జలుబు వస్తుందా వారి వారి వ్యదినిరోడక శక్తినిబట్టి జబ్బులు కూడా . అలాగే కొంత మందికి పుట్టుకతోనే సమస్యలును చాక చక్యంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉంటుది కొంతమంది చిన్నచిన్న సమస్యలకే గిల గిల కొట్టుకుంటారు . వారు పెరిగే వాతావరణం పెద్దవాళ్ళ పెంపకం మీద ఆధారపడి వుంటుంది . ఒత్తిడితో కూడిన మనిషి జీవన విదానం అనేక మానసిక సమస్యలకు దారితీస్తుంది , తద్వారా సమాజం మీదకూడా దాని ప్రభావం పడుతుంది అనేది వాస్తవం . ఒక కుటుంబ పెద్ద ఒత్తిడి ఆ కుటుంబం మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది . ఒక కంపనీ అదినేత వత్తిడిలో తీసుకున్న నిర్ణయం కొన్ని వందల ఉద్యోగుల భవిష్యత్ మీద ప్రభావం చూపిస్తింది ఒక దేశాదినేత లేదా ఒక రాష్ట్ర అదినేత వత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మొత్తం ప్రజానీకం మీద పడుతుంది .

 కొన్ని సంవత్సరాల పూర్వం ప్రైవేటు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజి లు కూడా (జాబు కన్సల్టెన్సీ) వస్తున్నాయి అంటే అని వినగానే అదొక విడ్డురం , కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజి అంటే నవ్వుతున్నారు (వారి నిర్వాకం కూడా అలానే వుంటుంది మరి ) అలాగే ప్రైవేటు పోస్ట్ ఆఫీసులు (కొరియర్)కూడా ఎప్పుడో వచ్చి చేరాయి మారుతున్న కాలంతోపాటు సేవల్లోకుడా అనేక మార్పులు వచ్చిచేరుతున్నాయి . చిన్నతనం నుండే పిల్లల మానసిక పరివర్తన , వికాసం అనుక్షణం గమనించి అవసరం అయితే వారిని పిల్లల మానసిక నిపుణులు (చైల్డ్ సైక్రాటిస్ట్ )దగ్గరకి అప్పుడప్పుడు తీసుకువెళుతూవుండాలి . అన్నిటికన్నా ముఖ్యం పెళ్ళైన భార్యా భర్తలు తమ వైవాహిక జీవితాన్ని ఎలా పొరపొచ్చాలు లేకుండా నడుపుకోవాలో మానసిక నిపుణులు సలహాలు ద్వారా తెలుసుకోవాలి ." ప్రివెన్సన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ "  అన్నట్లు సమస్య వచ్చిన తరువాత వెళ్ళే కంటే ముందుగానే వెళ్తే చాలా వరకు ప్రయోజనం వుంటుంది. ఇవాళ" ప్రీ మారిటల్ కోన్సుల్లింగ్ " కూడా చేస్తున్నారు అంటే పెళ్లి నిశ్చయమైన వదువరులుకు చేసే కోన్సుల్లింగ్ . అది ఇంకా మంచిది .

ఇవాళ ఎన్నో భార్యా భర్తల సమస్యలు , విద్యార్దుల సమస్యలు ప్రేమ వ్యవహారాలు , ఘోరాలు నేరాలు చూస్తునేవున్నాము వాటికి ప్రధానమైన కారణాలు అవగాహనా రాహిత్యం , మానసిక పరివర్తన లోపించటం . సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే మేల్కుంటే చాలా అనార్దాలకి అడ్డుకట్ట వెయ్యవచ్చు . దీని మీద ఇంకా అవగాహన ప్రజల్లో లేదనే చెప్పాలి , చాలా మంది సమస్య జటిలమైన తరువాతే తమ దగ్గరకు వస్తుంటారని మానసిక నిపుణుల అభిప్ర్రాయం ." మనో వ్యాదికి మందే లేదు" అనేది ఒక ముతక సామెత వ్యాది తీవ్రతనుబట్టి చాలా మందులు వున్నాయి . మందులతో నిమిత్తం లేకుండా కేవలం కోన్సుల్లింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించే వారిని "సైకాలజిస్ట్ " అని సంబోదిస్తారు. మానసిక వ్యాది మరీ తీవ్రం అయితే వారు మందులు వాడవలసి ఉంటుది అటువంటివారు "సైక్రియాటిస్ట్ " దగ్గర చికిత్స తీసుకోవలసి వుంటుంది , వీరు కోన్సుల్లింగ్ చేస్తూ అవసరం అనుకుంటే మందులు వాడమని చెప్తుంటారు కాని ఆ స్థితికి రాకుండా ఉండటమే మంచిది . వచ్చినా పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు .

వీటన్నింటికన్నా ముందు సుఖమైన ఆశావాద జీవితం , సానుకూల దృక్పదం , వ్యాయామం , యోగ విద్య , అట పాటలు , చక్కని సంగీతం , చక్కని ఆహారపు అలవాట్లు. "ఆయనే వుంటే తెల్ల చీరెందుకని " ఒక ముతక సామెత కూడా వుంది . ఇవన్ని మన జీవన విధానం లో లోపించటం మూలంగానే ముందు పేర్కున్న సమస్యలు . సాధ్యమైనంతగా దేశీయ మరియు సాంప్రదాయ వైద్య చికిత్స లైనటువంటి , యోగా, ప్రక్రుతి చికిత్స, ఆయుర్వేదం , హోమియో మొదలగు వాటికి ప్రాదాన్యతనివ్వటం అనేది ఉత్తమం. ఇవన్ని చెప్పినంత సులభం కాకపోయినా కానీ అసాధ్యం మాత్రం కాదు. కృషితో నాస్తి దుర్బిక్షం . సర్వేజన సుఖినో భవంతు .


మీగడ త్రినాధ రావు
మన తెలుగు మన సంస్కృతి
9848826150



ఏకపక్షం .."విశాఖ సంస్కృతి" మాస పత్రిక మర్చి 2013

     ఏకపక్షం 
ఈ నాటి చర్చలన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయి. మహిళలకు అన్యాయం జరుగుతుంది దానికి భాద్యుడు మగవాడే అని ఆడది, కాదు ఆడవాళ్ళ వేష భాషలు కూడా ఒక కారణమే అని మగవాడు ఎవరికి నచ్చినట్లు వారు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఏక పక్షంగా మాట్లాడుతున్నారు. ఇలా ఏక పక్ష వాదనలతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారు అనిపిస్తుంది. అసలైతే మొన్న డిల్లీ సంఘటన జరిగిన తరువాత ఇంక ఇలాంటి సమస్యలుకి ఒక పరిష్కారం దొరుకబోతుంది ఇక ముందు మగవాడు కొద్దిగా సర్దుకుంటాడు అన్న భావన ప్రతి ఒక్కరిలో వచ్చి ఉండవచ్చు ఎందుకంటె అది సామాన్య ప్రతిస్పందనా? యావత్ భారతావని చిన్నా , పెద్ద, ముసలి, ముతకా అన్న బేదం లేకుండా అందరు కదిలి ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. కాని ఒక ప్రక్క అది కొనసాగుతుండగానే అలాంటి సంఘటనలు పునరావృతం అయ్యాయి. అవుతున్నాయి కూడా. పసి పిల్లలు నుండి ముదుసలి వరకు అత్యాచారానికి గురవుతుంది. దీన్ని బట్టి వీటి మీద విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం వుంది . లోపం ఎక్కడో వుంది దాని గురించి మాములు గల్లీ చర్చలు చాలవు పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సిన అవసరం ఎంతయినా వుంది . ఏదో సమస్య వచ్చినపుడు మాత్రమే అతిగా స్పందించి మిగతా వారి విషయాల్లో మిన్నకుండి పోవటం తగదు . ఈ సమాజం మనం నిర్మించుకున్నదే దానికి మూలం వ్యక్తి , వ్యక్తికీ మూలం కుటుంబ వ్యవస్థ , దానికి మూలం స్త్రీ పురుషులిద్దరూ ముఖ్యంగా
  స్త్రీ పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు .  ఉన్మాదులు, ఉగ్రవాదులు , అవినీతి రాజకీయ నాయకులు , నేరగాళ్లు మొదలగు వారంతా  ఎక్కడినుండి పుడుతున్నారు?  మరి వీళ్ళని కన్నది, పెంచింది ఒక్క మగాడేనా , స్త్రీకి బాగం లేదా కొంత వయసు వచ్చే వరకు వ్యక్తి తల్లి చాటు బిడ్డే కదా . మహనీయులు చాలా మంది తండ్రి కంటే ముఖ్యంగా తల్లి పెంపకం లోనే తయారయ్యారని చరిత్ర చెబుతుంది . శారీరకంగా మగవాడు బలవంతుడు కావచ్చు కాని బుద్దిలో మాత్రం స్త్రీదే పై చేయి "ఇల్లును చూసి ఇల్లాలను చూడమన్నారు " కాని " యజమానిని చూసి ఇల్లును చూడమని మన పెద్దలేం చెప్పలేదు " సృజనాత్మకత మగాడి కంటే స్త్రీకే ఎక్కువ బహుశా అందుకే మోటు  పనులన్నీ మగాడికి అప్పజెప్పి క్రియాశీలక పనులన్నీ స్త్రీలు చెయ్యాలని మన భారతీయ సమాజం లోని పెద్దలు నిర్దేశించారేమో . చాలా మంది తర తరాల నుండి యుగ యుగాల నుండి స్త్రీని మగాడు అణిచి వేస్తున్నాడని అంటుంటారు . ఇందులో పూర్తి నిజం లేదనిపిస్తుంది . మన వేదాలు పురాణాలు ఇతిహాసాల్లో కూడా స్త్రీ కి సమాన ఆధిక్యత , ప్రాముఖ్యత గురించి వుంది . తమ భార్యలను దేవతలా పూచించే మహనీయులు మన చరిత్రలో ఎంతమంది లేరు? భార్య తప్పు చేసినా కళ్ళకు అద్దుకున్న మహనీయులు ఎంత మంది లేరు? ఎందరో మహనీయులు , మహిమాన్వితులు చరిత్రలో వున్నారు మరి వారిని కన్నది ఎవరు? స్త్రీ యే కదా చాలా మంది దుర్మార్గులు వున్నారు మరి వారిని కన్నది కూడా స్త్రీయే కదా . లోపం ఎక్కడ ? మగవాడు సంపాదన చేయటం స్త్రీ ఇల్లు నడపటం . ఇల్లు నడపటంలో ఆడవారికి వున్న  చాకచక్యం, ఓర్పు మగాడికి లేదనే చెప్పాలి " కడివెంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ " ఎందరో కండలు తిరిగిన మహా యెదులు స్త్రీ ముందు  బలాదూర్ . కొన్ని రాజ్యాలు స్త్రీల మూలంగా జయించిన రాజులూ వున్నారు పోగొట్టుకున్న రాజులూ చరిత్రలో వున్నారు . అంతెందుకు ఈ అఖండ భారతావని ఇప్పుడు ఒక్క గానొక్క స్తీ గుప్పెట్లో వుంది ఇది ఎవరైనా కాదనగలరా? ఎంతమంది స్త్రీలు కీలక పదవుల్లో లేరు?  మహిళా ముఖ్యమంత్రులు , రాష్ట్రపతులు , సభాపతులు , ప్రతిపక్షనేతలు ఇలా ఎంతో మంది వున్నారు . మరి మహిళా బిల్లును వ్యతిరేఖించే పార్టీల్లో స్త్రీలు లేరా? మరి వారు ఎందుకు ఎదురు తిరగరు? ఎందుకు వారి అధినేతల్ని నిలదీయరు? ఎందుకు ఉద్యమాలు చెయ్యరు? . వర కట్న దురాచారంలో స్త్రీకి పాత్ర లేదా కోడల్ని వేధించే అత్తలు , ఆడపడుచులు స్త్రీలు కారా? కూతుర్ని ఒకలా కోడల్ని మరోలా, కొడుకు చేస్తే ఒప్పు అల్లుడు చేస్తే తప్పు అనుకున్న మహిళా మణులు లేరా? వేరే ఎవరో వాళ్ళ పిల్లల్ని వేదిస్తే అతిగా స్పందించి తమ కొడుకు చేస్తే  " వాళ్ళ వేష భాషల వళ్ళే  మావాడు కామెంట్ చేసాడు లేకపోతె ఎందుకు చేస్తాడు అని కొడుకులు చేసే వెదవ పనులు వెనకేసుకొచ్చే అమ్మలు లేరా? నాన్నలు లేరా? ఎంతమంది లేరు? పసి పిల్లలని చూడకుండా పొట్టి పొట్టి దుస్తులేసి " రింగా రింగా ..లాంటి శృంగార పాటలకు నృత్యాలు చేపించి మురిసిపోయే తల్లులు, తండ్రులు  ఎంతమంది లేరు? వొళ్ళు చూపించటమే అసలైన నాగరికత అన్న చందాన మనుగడ సాగిస్తున్న నేటి సమజం లో స్త్రీ పాత్ర లేదా? "కష్ట సుఖాలు కావడి కుండలు" అన్న తీరున  స్త్రీ పురుషులిద్దరూ సమాజంలో జరుగుతున్న వాటికి సమానంగా భాద్యత వహించాల్సి వుంటుంది . నువ్వంటే నువ్వు అని ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటూ పొతే సమస్య మరింత జటిలం కాక మానదు. 

ఒకరు కాదు ఇద్దరు కాదు కర్ణుడి చావుకు అన్నీ కారణాలే అన్నట్లు సినిమాలు , సెన్సార్లు , ప్రభుత్వం , మీడియా అన్ని భాద్యత వహించాలి అంతేకాని నువ్వంటే నువ్వని ఏక పక్ష వాదనలతో స్త్రీ పురుషులిద్దరూ
 చేతులు దులిపెసుకొంటే మాత్రం స్త్రీ రక్షణ ఎప్పటికీ సాద్యం కాదు . స్త్రీ స్వాతంత్ర్యం కూడా ఏ ఒక్క రోజులోనే వచ్చేది కాదు నిరంతరం పోరాటం చేస్తే గాని రాదు . ఒక్క స్త్రీ సమస్యేమిటి ప్రస్తుతం మన దేశంలో చింతపండు ధర తగ్గలన్నా ఉద్యమాలు , నిరశనలు చేస్తే గాని తగ్గని పరిస్థితులు వున్నాయి. ఎన్నో అటు పోటులను ఎదుర్కొన్న స్త్రీ , ఎన్నో వివక్షలను ఎదుర్కొన్న స్త్రీ రాజారాం మోహన్ రాయ్ , కందుకూరి వంటి మహనీయుల చొరవతో మళ్ళి వారి హక్కుల్ని కాపాడుకొని ఈ రోజు పురుషుడితో సమానంగా అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుకుంటూ, తన ఉన్నతికి బాటలు వేస్తూ సాగుతుంది . కాని వంటరిగా ఆడది రాత్రులే కాదు పగలు కూడా నడిచే సందర్బాలు ఎదురవుతున్నాయి .

పరిష్కార మార్గాలు

>దీన్ని మన అతి పెద్ద సామాజిక సమస్యగా గుర్తించి ఆడ మగ అన్న బేదం లేకుండా నైతిక జీవనం సాగించేటట్లు కృషి చెయ్యాల్సిన అవసరం వుంది.
>ఏదో
  డిల్లీ వంటి అతి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మిగతా సంఘటనల విషయంలో మిన్నకుండి పోకుండా మహిళా సంఘాలు , ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు , పార్టీలు పెద్ద ఎత్తున చర్చలు, ఉద్యమాలు జరపాల్సిన అవసరం వుంది .
>తల్లిదండ్రులు ఎంతటి పని ఒత్తిడిలో వున్నా కూడా
 పిల్లల ప్రవర్తనా  సరళి చిన్నప్పటినుండే పరిశీలిస్తూ  వారిలో నైతికతను , సమస్యలను ఎదుర్కొనే ధీరత్వాన్ని నింపటానికి కృషి చెయ్యాలి .
>ఇరుగుపొరుగు వారిని చూసి పోటి తత్వాలకి పోకుండా పిల్లలకి ఆశక్తి లేని రంగాల్లో కాకుండా వారి ఇష్టా ఇష్టాలను కూడా గమనించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది .
>ఈనాడు చాలా మంది విద్యార్ధులు ఆశక్తి లేని చదువుల్లో రాణించలేక ఇటు
  తల్లిదండ్రుల వత్తిడి అటు విద్యాలయాల వత్తిడులు తట్టుకోలేక కొంత మంది ఆత్మ హత్యలు చేసుకుంటూ వుంటే మరికొంత మంది ఉన్మాదులుగా నేర ప్రవుత్తి స్వభావాన్ని అలవర్చు కుంటున్నారు.
>కేవలం తల్లిదండ్రులే కాకుండా
  ప్రభుత్వాలు, విద్యాలయాలు, మీడియా  సమాజం అందరూ సమిష్టిగా ఇది ఒక సామాజిక భాద్యతగా గుర్తించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది . అభివృద్ధి నాగరికత పేరుతో మితి మీరుతున్న పాచ్చ్యాత్య పోకడలకు అడ్డుకట్ట వేసి భారతీయతను , దేశభక్తిని , సామాజిక స్పృహను , భాద్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది .
> ముఖ్యంగా స్త్రీ పురుషుల సంబందాలు మెరుగుపడాలి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నుండే మార్పు సాకారం కావలి దానికి మూల వ్యక్తులు
  భార్య భర్తలే కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టం కావాల్సిన అవసరం ఎంతయినా వుంది ఎందుకంటే నేర ప్రవుత్తి అనేది ఒక మంచి పెంపకం లేకపోవటం , తల్లిదండ్రుల ప్రేమ రాహిత్యం , నిరాదరణే  కారణం అని మానసిక నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి .
> రోజు రోజుకు పెరుగుతున్న విడాకులు వలన పిల్లలు తీవ్రమైన నిరాదరణకు ఒత్తిడికి గురి అవుతున్నారు
 అనేది జగమెరిగిన సత్యం భార్యా భర్తలు మనస్పర్ధలు వచ్చినపుడు కోర్టులు చుట్టూ తిరగకుండా ఒక అనుభవజ్ఞులు అయిన మానసిక నిపుణులు (మారేజ్ కౌన్సలర్స్ ) దగ్గరకు వెళ్ళి కౌన్సుల్లింగ్ తీసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం .

ఒక మంచి సమాజం మంచి వ్యక్తులు వలన నిర్మితమైతే ఒక మంచి వ్యక్తి ఒక మంచి కుటుంబం నుండి తాయారు అవుతాడు . కుటుంబానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలు కాబట్టి ఒక మంచి కుటుంబ వ్యవస్థ దిశగా
  ప్రతి స్త్రీ పురుషుడు నిరంతరం కృషి చెయ్యవలసిన అవసరం ఎంతయినా వుంది .